ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా?: పేర్ని నాని

  • పవన్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం కౌలు రైతులను మోసం చేసింది నిజం కాదా? 
  • పవన్ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోంది?
  • చంద్రబాబు దత్తపుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ 
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం కౌలు రైతులను మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అప్పుడు కౌలు రైతుల గురించి పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించడం ఒక్కటే పవన్ కు తెలుసని విమర్శించారు. 

ప్రస్తుతం పవన్ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోందని పేర్ని నాని ప్రశ్నించారు. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూ అంటూ విమర్శించిన బీజేపీతో మీరు ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చట్టం చేయించాలని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని... దత్తపుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కు ఉందా? అని ప్రశ్నించారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను కూల్చి వేసిన ఘటనపై పేర్ని నాని స్పందిస్తూ... రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. నిజమైన బీసీ నాయకులు ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కబ్జా చేయరని చెప్పారు.

Pawan Kalyan
Janasena
Perni Nani
YSRCP
Telugudesam
BJP

More Telugu News